సైబర్ నేరాలకు పూర్తిచెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ క్రైమ్స్ జరగడానికి మెయిన్ రీజన్ గా మారిన సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లపై ఇప్పుడు కేంద్రం దృష్టి పెట్టింది.నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు తీసుకుని, వాటిని సైబర్ నేరాలకు దుర్వినియోగం చేస్తున్న 2.17 కోట్ల సిమ్ కార్డులను రద్దు చేయడానికి కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సుమారు 2.26 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేస్తామంటూ కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ.. ఉన్నతస్థాయి ప్యానెల్కు చెప్పినట్టు తెలుస్తోంది. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ సమావేశంలో సిమ్ కార్డ్ కనెక్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలికాం శాఖ వివరించినట్లు సమాచారం . అలాగే సిమ్ కార్డుల జారీ సమయంలో కేవైసీని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపింది.
బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఐటీ శాఖ, ఆర్బీఐ, ఎన్ఐఏ, సీబీఐ అధికారులు, ఇతర భద్రత ఏజెన్సీలకు చెందిన నిపుణులు, అన్ని రాష్ట్రాల సీనియర్ అధికారులు ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ సంవత్సరంలో మార్చికి ముందు 6 నెలల కాలంలో సైబర్ నేరాల బారినపడిన భారతీయులు సుమారు రూ.500 కోట్లు పోగొట్టుకున్నారట. దీనిపై దృష్టి పెట్టిన మోదీ ప్రభుత్వం సైబర్ నేరాలపై ఉన్నతస్థాయి ప్యానెల్ను ఏర్పాటు చేసింది. నిర్దేశిత పరిమితికి మించి, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తీసుకున్న.. లేదా సైబర్ నేరాలకు వినియోగించిన దాదాపు 2.17 కోట్ల సిమ్ కార్డులను టెలికాం శాఖ డిస్కనెక్ట్ చేయబోతోంది. అలాగే 2.26 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డేటా ఎంట్రీ పోస్టులకు భారీగా జీతాల ఆశ చూపి.. సైబర్ మోసాలు చేయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. టెలీకాలర్స్గా ఫోన్ చేసి.. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలు వస్తాయని మోసగించడమే వీరి పని అని తెలుసుకుంది . అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం.. పలు మంత్రిత్వ శాఖలతో కలిపి ఒక కమిటీ వేసింది. టెలికాం, బ్యాంకింగ్, ఇమిగ్రేషన్ సహా కొన్ని సెక్టార్లలో ఉన్న లోపాల్ని ఈ కమిటీ గుర్తించింది. భారతీయ నంబర్లుగా కనిపించే ఇంటర్నేషనల్ నంబర్స్, కాల్స్ను బ్లాక్ చేయాలని కొంత కాలం కిందటే టెలికాం శాఖ టెలికాం ఆపరేటర్స్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే సిమ్ కార్డుల రద్దు, మొబైల్ హ్యాండ్సెట్స్ బ్లాక్ చేయడానికి సంబంధించి.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.