వంటగ్యాస్ ధరను పెంచి దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుపుకుంటున్న వినియోగదారులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. LPG సిలిండర్ పెరిగిన ధరలు నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో సిలిండర్పై అదనంగా 62 రూపాయలను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంచిన ధరలు ఈ తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు 1,802 రూపాయలకు పెరిగింది.
నిన్నటి వరకు ఈ ధర 1,740 రూపాయలుగా ఉండేది. కోల్కతలో రూ.1,850.50 పైసల నుంచి 1.911.50 పైసలకు పెరిగింది. ముంబైలో రూ.1,692.50 పైసల నుంచి 1,754.50 పైసలకు పెరిగింది. చెన్నైలో 1,903 నుంచి 1,964.50 పైసలకు చేరింది ఒక్కో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర. నాలుగు నెలల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా వాటి రేట్లను పెంచాయి చమురు కంపెనీలు. ఆగస్టు, సెప్టెంబర్లో ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన కంపెనీలు అక్టోబర్ 1న కూడా రూ.48.50 పెంచాయి. పెరిగింది. ఇప్పుడు నవంబర్ నెలలో కూడా వాణిజ్య సిలిండర్లు ధరలు మరోసారి పెరిగాయి.
ఇప్పుడు మళ్లీ 62 రూపాయలు చొప్పున పెంచాయి. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర 803 రూపాయలు. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.