ఏపీలో కొద్ది రోజులుగా అయోమయంలో ఉన్న వలంటీర్ వ్యవస్థపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల..రాష్ట్రానికి భారం కాకుండా పరిమిత సంఖ్యలోనే వలంటీర్ల సేవలను వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.దీనికోసం వలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.
త్వరలోనే వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వలంటీర్లలో ఎవరెవరు ఎంత చదువుకున్నారు? ఎవరికి ఏ పనిలో నైపుణ్యం ఉందో అధికారలతో ఆరా తీయిస్తున్నారు. వలంటీర్ పోస్టుకి విద్యార్హతగా పదో తరగతి నిర్ణయించడంతో….చాలా మంది డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అప్పట్లో వలెంటీర్గా జాయిన్ అయ్యారు.
వీరిలో కొంతమంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వలెంటీర్ల విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా శిక్షణ ఇప్పించి ప్రైవేటు, కార్పొరేట్ సెక్టార్లో ఉద్యోగాలను కల్పించడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది.అయితే దీనిపై ముందుగా వలంటీర్ల విద్యార్హతలపై సమగ్ర డేటా సేకరించి ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం ఏపీలో లక్షా 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. అయితే వీరిలో కొంతమందికి వారి వారి నైపుణ్యం బట్టి ప్రత్యామ్నాయం చూపించి మిగితా వారిని వలంటీర్లుగా కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ సేవలు అందిస్తుండగా.. వీరి పరిధిని మరింత పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది.
వీటితో పాటు వలెంటీర్లకు మరిన్ని విధులను అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వలంటీర్ వ్యవస్థను తొలగించి.. చిరుద్యోగుల పొట్ట గొట్టాలనే ఉద్దేశం తమకు లేదనే విషయాన్ని చంద్రబాబు అందరికీ అర్ధం అయ్యేలా చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా ఇలా వలంటీర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారన్న వార్తలతో వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
,, ,,