శిల్పా శెట్టి దంపతులకు బాంబే హైకోర్టులో ఊరట..

Relief For Shilpa Shetty Couple In Bombay High Court

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్‌ కేసులో ఇల్లు, ఫామ్‌ హౌస్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ శిల్పాశెట్టి దంపతులు ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో శుక్రవారం విచారణ జరిపిన ట్రయల్ కోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది. కోర్టులో జరిగిన వాదనల సమయంలో, శిల్పా శెట్టి తరపు న్యాయవాది మాట్లాడుతూ, 2017లో జరిగిన ‘గెయిన్ బిట్ కాయిన్ పోంజీ స్కీమ్’కు తన క్లయింట్లకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ అంశం ఈడీ పరిధిలోకి రాకుండా ఉండాల్సిందిగా ఆయన వాదించారు. అయితే, నిజానిజాలు బయటకు వచ్చే వరకు వారు ఈడీ విచారణకు సహకరిస్తామని న్యాయవాది ప్రకటించారు.

2017లో రాజ్ కుంద్రా సంస్థ బిట్ కాయిన్‌ల రూపంలో దాదాపు రూ. 6.600 కోట్లు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. నెలకు 10% రిటర్న్‌లు ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు కేసు ఫైల్ అయింది. అమిత్ భ‌ర‌ద్వాజ్ అనే వ్యక్తి నుంచి రాజ్‌కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లు తీసుకున్నారని, వాటితో ఉక్రెయిన్‌లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర పోలీసులు మరియు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.

ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఈడీ.. శిల్పా శెట్టి దంపతులకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ముంబాయిలోని శిల్పాశెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పూణేలోని ఒక ఫ్లాట్‌, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. ఈ మేరకు భవనాలను ఖాళీ చేయాలనీ ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై శిల్పా‌శెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే ఇచ్చింది.