ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ప్రపంచ పెట్టుబడుల సదస్సు పైనే ఉంది. ఏటా దావోస్ లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరుగుతూ ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు, దిగ్గజ సంస్థల ప్రతినిధులు వస్తుంటారు. లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సులో నిర్ణయాలు జరుగుతుంటాయి. అందుకే అన్ని దేశాలు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి. ఐతే వైసీపీ ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఈ సదస్సును చాలా తేలికగా తీసుకుంది. ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సదస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ.. ప్రత్యేక బృందాలతో హాజరవుతున్నాయి.
ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకు దావోస్ సమ్మిట్ చాలా ప్రత్యేకమైనదనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి హోదాలో చాలాసార్లు ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో పెట్టుబడులు ఆకర్షించే ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తుంటారు. సమ్మిట్లో ప్రత్యేక పెవిలియన్, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీకి ఏపీ సీఎం ప్రాధాన్యమిస్తుంటారు. ఈ సమ్మిట్కు హాజరవ్వడంతో పాటు ఒక హైప్ క్రియేట్ చేయడానికి డబ్బుల ఖర్చుకు కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. ఇప్పటికే అంతర్జాతీయంగా ఏపీ సీఎం చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీయే కూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ సమ్మిట్లో సీఎం చంద్రబాబు సీనియార్టీకి,మేధస్సుకు తగిన గుర్తింపు కచ్చితంగా ఉంటుందనేది తెలుస్తుంది.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ సమ్మిట్కు వెళ్లడం రెండోసారి. గతేడాది అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమ్మిట్ ప్రారంభం కావడంతో.. ఎటువంటి సన్నాహాలు లేకుండానే హాజరయ్యారు. కానీ ఈసారి మాత్రం రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పూర్తి ప్రిపరేషన్ తో వెళ్తున్నారు. తన టీం ముద్ర అక్కడ స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ హయాంలోనూ ఇప్పుడు రేవంత్ హయాంలోనూ ఐఏఎస్ అధికారి జియేష్ రంజన్ పెట్టుబడుల వ్యవహారాలను, కంపెనీలతో టచ్ లో ఉండటం చేస్తున్నారు. ఈసారి కూడా జియేష్ దావోస్ సదస్సులో తెలంగాణకు ప్రత్యేక పెవిలియన్ తో పాటు ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కాగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణమే నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబుకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో.. ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పర సహకారం అందించుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి ఎక్కువగా ఉంది. దానిని నిలబెట్టుకుంటూ కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి రేవంత్ సిద్ధం అయ్యారు. అదే సమయంలో నవ్యాంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం అనేది సీఎం చంద్రబాబు ముందున్న తక్షణ కర్తవ్యం. దీంతో అపార రాజకీయ అనుభవం,విజన్ ఉన్న నేతగా గుర్తింపబడిన ఏపీసీఎం.. భారీగాపెట్టుబడులు తీసుకువస్తారన్న నమ్మకంతో ఏపీ ప్రజలున్నారు.