మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా.. ఏకనాథ్ షిండే ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో.. పూనే ఎయిర్ పోర్ట్ పేరును మార్చాలని నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్లో పూణే విమానాశ్రయం పేరును.. ‘జగద్గురు సంత్ తుకారాం మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం’గా షిండే ప్రభుత్వం నిర్ణయించింది. దీని కంటే ముందు పూనే విమానాశ్రయ పేరు లోహ్గావ్ విమానాశ్రయంగా ఉండేది. కాగా.. పూనేలోని ఎయిర్ పోర్ట్ పేరును మార్చాలనే సూచనను.. మురళీధర్ మోహోల్ ఇచ్చినట్లు చెప్పారు.
మురళీధర్ మోహోల్ మహరాష్ట్ర ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పూనే విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు పెట్టాలని, కొత్త విమానాశ్రయానికి మాత్రం ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరు పెట్టాలని మురళీధర్ సూచించినట్లు తెలిపారు
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రెండు రోజుల ముందు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. లోహ్గావ్ ఎయిర్ పోర్టు పేరును మారుస్తామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను తదుపరి కేబినేట్లో ఉంచుతామని చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత.. ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది పంపబడుతుందని వివరించారు. అయితే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపాదనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. అంతేకాకుండా.. పూనే విమానాశ్రయం పేరు మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా ఆమోదం కోసం ప్రయత్నిస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు.