మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదట..

సమ్మర్‌లో చాలామంది వెజిటేరియన్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఎప్పుడూ వెజిటేరియన్ ఫుడ్ తింటేనే మంచిదని.. నాన్ వెజ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు అంటున్నారు. అందరూ అనుకున్నట్లు నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్ ఫుడ్ తింటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. ముఖ్యంగా చికెన్, మటన్ కు ఎంత దూరంగా ఉంటే అంతగా హెల్త్ బాగుంటుందని సూచిస్తున్నారు.

చాలామంది ప్రాసెస్డ్ మీట్ తినడానికి ఇష్టపడతారు. కానీ ఇది ఎక్కువగా తింటే శరీరానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా డీప్ ఫ్రై చేసిన వంటకాలలో ఎక్కువగా నాన్ వెజ్ వే ఉంటాయి. చికెన్ 65, చికెన్ పకోడా, క్రిస్పీ చికెన్, చికెన్ పాప్ కార్న్, మటన్ కబాబ్, చికెన్ ఫ్రై వంటి వంటకాలను రెస్టారెంట్స్‌లో కొన్నిసార్లు పదే పదే వేడి చేసి అందిస్తారు. కానీ వీటివల్ల జీర్ణ సంబంధ సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు మాంసం ఎక్కువగా తింటే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కొన్ని పరిశోధనలో తేలిందట. అలాగే గొడ్డు మాంసం, పంది, గొర్రె మాంసం తినడం వల్ల..వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు తేల్చారు. సాధారణంగానే నాన్ వెజ్ ఆహారాల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయని.. వీటిని ఎక్కువగా తీసుకుంటే కొలస్ట్రాల్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే వీటిలో మసాలాలు, కారం , నూనె వంటివి ఎక్కువ మోతాదులో వాడటం వల్ల గుండెజబ్బులు, ఊబకాయం వంటి బారిన పడే అవకాశం ఉంటుంది.

వేసవి కాలంలోనే కాదు మిగిలిన కాలాలలో కూడా వీలయినంత వరకూ నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఒకవేళ చికెన్, మటన్ వంటివి తిన్నా కూడా మసాలాలు, నూనెలు తగ్గించి తినమని సూచిస్తున్నారు. అది కూడా ఒకరోజుకు 170 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని.. అంతకంటే ఎక్కువ మోతాదులో తింటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.