చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు తాము తినే ఆహారం విషయంలో అనేక సందేహాలతో ఉంటారు. ఏం తినాలి, ఏం తినకూడదనే అనుమానం నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. కనీసం పండ్లు తినాలన్నా భయపడుతుంటారు. పండ్లు తినడానికి వెనుకా ముందు ఆలోచిస్తుంటారు. అయితే కొన్ని పండ్లను తినవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను డయాబెటిస్ బాధితులు తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
మధుమేహం ఉన్నవాళ్లు జీఐ తక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలగడంతో పాటు వాటిలో పొటాషియం, ఫైబర్తో పాటు పలు విటమిన్లు, శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్ వల్ల.. మధుమేహుల్లో చక్కెర, ఇన్సులిన్ లెవెల్స్కు ఎలాంటి చేటు చేయవు.
అలాగే దానిమ్మ పండును ఈ వ్యాధి ఉన్న వాళ్లు తినటం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో చక్కెర నిల్వలు కొద్దిగానే ఉంటాయి. నారింజ, నేరేడు , జామ, పైనాపిల్, అంజీర్ వంటి పండ్లను షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చు. ఇలాంటి పండ్లను అధిక మోతాదులో కాకుండా, తరచూ తీసుకోవటం వల్ల చక్కెర స్ధాయి నియంత్రణలో ఉంటుంది. మామిడిపండ్లు స్వీట్ నెస్ ఎక్కువ ఉన్న సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి.. ఆ సమయంలో రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే డయాబెటిక్ తో బాధపడేవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు.
డయాబెటిస్ బాధితులు పీచ్, చెర్రీ, ప్లమ్, యాపిల్, ఆరంజ్ వంటి పండ్లను తీసుకోవచ్చు ఎందుకంటే వీటి జీఐ 45 కంటే తక్కువగా ఉండటంతో అది వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. యాపిల్ పండును డయాబెటిక్ పేషెంట్లు తినటం వల్ల ఇన్ ఫెక్షన్లను దూరంగా పెట్టొచ్చు. ద్రాక్షపండ్లు తినటం వల్ల రక్తప్రసరణ మెరుగవ్వటంతోపాటు, కొవ్వుశాతం తగ్గుతుందట.