అరుదైన కార్యక్రమానికి వేదిక కాబోతున్న భాగ్యనగరం

Hyderabad To Be The Venue For A Rare Event

మిస్ వరల్డ్ పోటీలకు విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో తలపడటానికి ఏకంగా 120 దేశాలకు చెందిన అందాలభామలు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 29 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ అందాల పోటీలు భారత్‌లో జరగనుండటం అందులోనూ దానికి హైదరాబాద్ వేదికగా మారడం ప్రత్యేకత సంతరించుకుంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే.. మిస్ వరల్డ్ పోటీలను మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు షెడ్యూల్ రిలీజ్ చేశారు..

భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలను 29 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 1951లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎరిక్ మోర్లీ.. మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించారు. అప్పటినుంచి 74 సంవత్సరాలుగా ఈ ఐకానిక్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతీ ఏటా జరుగుతూనే ఉన్నాయి. ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పిలిచే ఈ మిస్ వరల్డ్ కార్యక్రమానికి బ్రిటిష్ ప్రెస్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తోంది.

మొదటిసారి 1951లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించినపుడు స్వీడన్‌కు చెందిన.. కెర్‌స్టిన్ కికీ హకాన్సన్ ఫస్ట్ మిస్ వరల్డ్‌గా నిలిచింది. ప్రతీ ఏటా మిస్ వరల్డ్ ఫైనల్స్‌ను పర్యవేక్షించే బాధ్యతను.. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కలిగి ఉండటంతో ఇవి వరల్డ్ లోనే అతిపెద్ద ఈవెంట్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికలాంగులు, వెనుకబడిన పిల్లలకు సహాయం చేయడానికి ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ..స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరించి వంద కంటే ఎక్కువ దేశాల్లో సర్వీసులను అందిస్తోంది.

చివరిసారి భారతదేశం 1996లో మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు దాదాపు 3 దశబ్దాల తర్వాత ఈ పోటీని భారతదేశంలో అది కూడా తెలంగాణలో నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ మిస్ వరల్డ్ పోటీలను మొదట ఢిల్లీలో నిర్వహించాలని అనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకుని ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌కు మార్చారు.