అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ప్రస్థుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్చైర్మన్ సొయాంగ్ జూ సహా 25 అగ్ర శ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందయ్.. తెలంగాణలో హ్యుందాయ్ మోటర్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. హ్యుందాయ్కి చెందిన హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. హైదరాబాద్లోని ఇంజినీరింగ్ సెంటర్ను హ్యుందాయ్ ఆధునికీకరించనుంది. మెగా టెస్ట్ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది.
సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సైతం ప్రస్తుతం దక్షిణ కొరియాలో సందర్శిస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన.. పరిశ్రమలు రాని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. దీంతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధమని కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు.
హన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్తో భేటీ అవనున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నారు. శామ్సంగ్ ప్రతినిధులతో పాటు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీనియర్ లీడర్షిప్తో చర్చలు జరపనున్నారు. అలాగే శామ్సంగ్ హెల్త్ కేర్ యూనిట్తో భేటీ కానున్నారు. కాల్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో రేవంత్ టీం పెట్టుబడులపై చర్చలు నిర్వహించనుంది. అనంతరం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని రేవంత్ టీం సందర్శించనుంది. హన్ రివర్ ఫ్రంట్, హన్ రివర్ పార్క్ ఫీల్డ్ విజిట్ చేయనుంది. ఇక నేటి రాత్రికి రేవంత్ బృందం హైదరాబాద్కు పయనం కానుంది. అలాగే నిన్న విద్యుత్తు, గ్యాస్, బ్యాటరీల రంగంలో ఎల్ఎస్ పెట్టుబడులు..కొరియాలో అతిపెద్ద పరిశ్రమల గ్రూపు ఎల్ఎస్ కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.