ముఖ్యమంత్రి కావాలనే తన కల నెరవేరిందని, అంతకుమించిన పెద్ద కలలు మాత్రం తనకు లేవన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ లోని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనపై ముందడుగే వేస్తామన్నారు. మూసీ నదిని బాగు చేసేవాడు ఒకడొచ్చాడని ప్రజలకు తెలిసిందన్నారు… నేను ఫుట్బాల్ ప్లేయర్ను… గేమ్ ప్లాన్పై నాకు పూర్తి స్పష్టత ఉందన్నారు. 55 కిలోమీటర్ల మేర మూసీ పునరుజ్జీవమైతే భాగ్యనగరం అద్భుత నగరం అవుతుందన్నారు.
మూసీ ప్రాజెక్టులో భాగంగా ముందుగా బాపూఘాట్ నుంచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. నవంబర్ నెలలో మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. మూసి ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే రూ.140 కోట్లతో డీపీఆర్ తయారీకి ఆదేశాలిచ్చామన్నారు. మూసీ నిర్వాసితులకు ఉచితంగా విద్య, అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూసీ చుట్టూ నైట్ సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ప్రజలను ఇబ్బందిపెట్టి తాము భూములు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. మూసీ కోసం భూములు ఇచ్చే వారికి వంద శాతం న్యాయం చేస్తామన్నారు.
అంతర్జాతీయస్థాయి అవగాహన ఉన్న కేటీఆర్కు మూసీని ఎలా బాగు చేయాలో తెలియదా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నుంచి కూడా సలహాలను ఆహ్వానిస్తున్నామన్నారు. మూసీకి సంబంధించి కేటీఆర్తో పాటు హరీశ్ రావు, ఈటల రాజేందర్ కూడా తమ ప్రతిపాదనలు పంపించాలన్నారు. మూసీని ఎన్జీవోలు వ్యతిరేకిస్తే అర్థం ఉంటుందని, కానీ బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కావడం లేదన్నారు. మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ల అంశాలపై విచారణ జరుగుతుందన్నారు. ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా విచారణ ఉంటుందన్నారు. ప్రజలకు మంచి చేయాలని మాత్రమే అనుకుంటున్నామని, కాబట్టి రాజకీయంగా నష్టం జరిగినా తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేశామన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు, సంక్షేమ పథకాల అమలు… ఇలా అన్నీ చేస్తున్నామన్నారు.