రెయిన్ అలర్ట్… తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

Rains In Telangana For Five Days | Mango News Telugu

కొద్దిరోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడు చూసినా ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటోంది.అయితే తాజాగా మరోసారి వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనుండటంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం,మంచిర్యాల,వికారాబాద్‌, సంగారెడ్డి, నిర్మల్‌,వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం సంగారెడ్డి, మెదక్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌,వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భువనగిరి, వికారాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ రెండ్రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో అత్యధికంగా 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవగా.. సిద్దిపేట అర్బన్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

మరోవైపు దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ , తమిళనాడు , బెంగాల్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయినిలో చాలా ఆలయాలలోకి వరదనీరు చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తమిళనాడు, కర్నాటక సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.