తెలంగాణ బీజేపీ చీఫ్ రేసులో ముగ్గురు..

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్‌కి చేరుకుంది. ఈ నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో.. కౌన్‌ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్‌…? అంటూ కాషాయ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.నిజానికి కొద్ది రోజుల ముందు నుంచీ కూడా బీజేపీ చీఫ్ ఎవరనే డిబేట్లు పొలిటికల్ సర్కిల్లలో నడుస్తోంది.

బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్‌ను రాష్ట్ర నేతల ఏకాభిప్రాయంతో సెలెక్ట్ చేస్తారని, వారం రోజుల తర్వాత ఈ ఎన్నిక ఉంటుందని కిషన్‌ రెడ్డి అన్నారు.దీంతో ఇప్పుడు తెలంాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్‌ మోస్ట్ క్లైమాక్స్‌కి చేరుకుందని… షార్ట్‌లిస్ట్‌ కూడా సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో షార్ట్‌లిస్ట్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలంటూ రామచంద్రరావు బీజేపీ పెద్దల్ని కలిశారు . పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో.. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా సునీల్‌ బన్సల్‌, బీఎల్ సంతోష్‌ సహా ముఖ్యనేతలతో.. ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులంతా తాజాగా సమావేశమయ్యారు.

మరోవైపు హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరును పరిశీలిస్తున్నట్లు కూడా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మహిళా కోటాతో పాటు రెడ్డి సామాజికవర్గ సమీకరణాలు డీకే అరుణకు ఇప్పుడు ప్లస్‌ పాయింట్స్ గా మారుతున్నాయి. అయితే.. ఈ ముగ్గురిలో ఈటల రాజేందర్‌ రేసులో ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించడానికి ఈటల ఆప్షన్ అవడం..అలాగే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ప్లస్‌ పాయింట్‌ అవుతుందన్న సామాజిక లెక్కలు బయటకు వస్తున్నాయి.

షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించిన తర్వాత అతి త్వరలోనే అది కూడా ఈనెలాఖరులోగా కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి ప్లేస్‌లో కొన్ని రోజులుగా చాలా పేర్లు వినిపిస్తూ వచ్చాయి. ఈటల రాజేందర్‌తో పాటు ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు పేర్లు తెరపైకి వచ్చాయి.

అంతేకాదు ఈ రేసులో కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా ఉంటారనే ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ ఇప్పుడు అవన్నీ తోసిపుచ్చుతూ.. ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటల, డీకే అరుణ, రామచంద్రరావు.. ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.