పాకిస్థాన్లో వేర్పాటువాద సంస్థ అయిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధ బలగాలు మారణకాండను సృష్టించాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లు, రైల్వే ట్రాకులు, వాహనాలపై కాల్పులకు పాల్పడి 70 మందికి పైగా హత మార్చాయి.
అయితే దీనికి తమదే బాధ్యతని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పాక్ ప్రభుత్వ, భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి అలాగే, సోమవారం తెల్లవారు జామున సాయుధులు కాల్పులకు తెగబడినట్లు చెప్పారు.ఈ దాడుల్లో 70 మందికి పైగా మరణించారని పాక్ ప్రభుత్వ, భద్రతా అధికారులు వెల్లడించారు.
మొదటి ఘటన ముసాఖేల్ జిల్లాలోని రరాషమ్లో ఆగస్ట్ 8 రాత్రి జరిగింది. ఇక్కడ పంజాబ్ ప్రావిన్స్ నుంచి వస్తున్న బస్సులను 10 మంది సాయుధులు ఆపి దానిలో వారిలో ప్రయాణికులను కిందకు దించి.. వారి గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి వారిలో 23 మందిని కాల్చి చంపేశారు.
అదేరోజు జరిగిన మరో ఘటనలో కలత్ ప్రాంతంలో ఐదుమంది పౌరులతో పాటు ఆరుమంది భద్రతా సిబ్బందిపై ఈ వేర్పాటువాదులు కాల్పులు జరిపి చంపేసారు. బలూచిస్థాన్ గిరిజన లీడర్ నవాబ్ అక్బర్ఖాన్ బుగ్టీ వర్ధంతి సందర్భంగా ఈ దాడులు కొనసాగినట్లు పాక్ ప్రభుత్వ, భద్రతా అధికారులు చెప్పారు.
ఆ తర్వాత బొలాన్ జిల్లా కొల్పూర్లో జరిగిన దాడిలో మరో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వేర్పాటువాదుల దాడులను తీవ్రంగా ఖండించారు. సాయుధులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేశారు.