సంక్రాంతి మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల్లో ఏకంగా 400 రూపాయల కోట్ల విలువైన మద్యాన్ని తాగేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చివరి రెండు రోజుల్లోనే 300 రూపాయల కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం అమ్మకాలు జరిగినట్లు మద్యం దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
భోగి పండగ రోజు ఏపీ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరగ్గా.. సంక్రాంతి, కనుమ రోజుల్లో అయితే రోజుకు 150 కోట్ల రూపాయల చొప్పున మద్యం విక్రయాలు జరిగినట్లు లెక్కలు వేస్తున్నారు. ఇది సాధారణం కంటే 160 కోట్లు అధికం అని అధికారులు చెబుతున్నారు. మామూలు రోజుల్లో రోజూ 80 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. కానీ పండగ మూడు రోజుల్లో అదనంగా 160 కోట్ల రూపాయల మద్యం అమ్ముడైనట్లు తెలుస్తోంది. భోగి రోజున మద్యం లైసెన్స్దారులు 210 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేయగా.. గురువారం మళ్లీ రూ. 220 కోట్ల మద్యాన్ని తీసుకువచ్చారు.
దీని ప్రకారం సంక్రాంతి పండగ కోసం తెచ్చుకున్న సరుకు ఖాళీ అయిపోవడంతో.. ముక్కనుమ రోజున లిక్కర్ షాప్ ఓనర్లు భారీగా మద్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు అయింది.జనవరి 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చూస్తే 7 లక్షల కేసుల మద్యంతో పాటు 2.30 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ 6 రోజుల్లో మద్యం అమ్మకాలు సగటు కంటే లక్ష కేసుల మద్యం, దాదాపు 30 వేల కేసుల బీర్లు ఎక్కువ అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ సంక్రాంతి పండగకు ఈ స్థాయి అమ్మకాలు నమోదు కాలేదని అంటున్నారు.ఈసారి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. డిసెంబర్ 31వ తేదీన ఏపీలో 200 కోట్ల మద్యాన్ని తాగేశారు. ఆ ఒక్కరోజు 2.5 లక్షల కేసుల మద్యం, 70 వేల కేసుల బీర్లు అమ్ముడైనట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ తెలిపింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం రావడం..మద్యం ధరలు తగ్గించడం, నాణ్యమైన మద్యం సరఫరా వంటి కారణాలే ఇప్పుడు సంక్రాంతి పండగకు మద్యం అమ్మకాల్లో పెరుగుదలను నమోదు చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా.. ఎక్సైజ్ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అలాగే ప్రతీసారి న్యూ ఇయర్ సందర్భంగా.. మద్యం అమ్మకాలు భారీగానే ఉంటాయి.