అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్గా మెడికల్ స్టూడెంట్ అంబుల వైష్ణవిని నియమించారు. ఈ సందర్బంగా అంబుల వైష్ణవి ఫిబ్రవరి 28న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. చిన్న వయస్సులోనే సామాజిక బాధ్యతను స్వీకరించి అమరావతి డెవలప్మెంట్ కోసం తన వంతు సహకారం అందిస్తున్నందుకు సీఎం చంద్రబాబు.. వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా అంబుల వైష్ణవి ఎవరనే చర్చ ఏపీ వ్యాప్తంగా సాగుతోంది. స్థానికంగా అమరావతికి చెందిన వైష్ణవి..అత్యంత చిన్న వయస్సులోనే అమరావతి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. అలాగే రాజధానికి నిధుల సమీకరణలోనూ కీలక పాత్ర పోషించారు. గతంలోనే 50 లక్షల రూపాయలను విరాళంగా అందించిన ఆమె, అమరావతి నిర్మాణం కోసం మరింత విరాళాలు సమీకరించాలనే సంకల్పాన్ని సీఎం చంద్రబాబు ముందు వ్యక్తం చేశారు.
తనను సచివాలయంలో కలవడానికి వచ్చిన అంబుల వైష్ణవిని అభినందించిన సీఎం చంద్రబాబు ..రాష్ట్రాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతీ యువకులలో సేవా స్ఫూర్తిని పెంపొందేలా ప్రోత్సహించాలని సూచించారు. అంబుల వైష్ణవి లాంటి యువతీ యువకులు తమ సామాజిక బాధ్యతను గుర్తించి ముందుకు రావాలని సీఎం కోరారు.
అమరావతి రాజధాని ప్రాధాన్యతను ప్రజలకు వివరించడానికి, అమరావతి డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేయాలని వైష్ణవికి సీఎం సూచించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం చేపడుతున్న చర్యలను విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు అందరి మద్దతు పొందేలా పనిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అంబుల వైష్ణవిని ప్రత్యేకంగా అభినందించారు. వైష్ణవి సేవాభావానికి ప్రశంసలు కురిపించారు. దీనిపై మాట్లాడిన వైష్ణవి ..అమరావతి అభివృద్ధి తన కల అని చెప్పింది. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మద్దతును ఏపీవ్యాప్తంగానే కాదు భారత దేశ వ్యాప్తంగా కూడా సేకరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపింది.