ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 24, బుధవారం నాడు “వైఎస్ఆర్ కాపు నేస్తం” పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య గల కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల జీవనోపాధిని మెరుగుపర్చేలా ఏడాదికి రూ.15 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.75 వేల ఆర్ధిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే గుర్తించిన అర్హులైన 2,35,873 మంది కాపు మహిళలు బ్యాంకు ఖాతాలలో రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు ఈ రోజు జమ కానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగిందని చెప్పారు. అలాగే గత సంవత్సర కాలంలోనే కాపులకు కాపు నేస్తం, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, జగనన్న చేదోడు, విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా దాదాపు 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో సగటున సంవత్సరానికి రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. అర్హత ఉండి కాపు నేస్తం రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందకుండా, మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu