తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన ప్రభావశీలమైన పాలన, వ్యూహాత్మక రాజకీయాలతో రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాను ద ఇండియన్ ఎక్స్ప్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది 39వ స్థానంలో ఉన్న ఆయన, ఏడాదిలోనే 11 స్థానాలు ఎగబాకి ముందుకు రావడం గమనార్హం.
రాజకీయంలో పెరుగుతున్న ప్రాముఖ్యత
తెలంగాణలో నిర్వహించిన సంస్కరణలు, పాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అలాగే ఇండియా కూటమిలో ఆయన పోషిస్తున్న ప్రధాన పాత్ర వల్ల రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు దక్కింది. రాష్ట్ర పరిమితులను దాటి దేశవ్యాప్తంగా తన ముద్ర వేయడంలో ఆయన సఫలీకృతమయ్యారు. తనదైన దూకుడు, స్పష్టమైన రాజకీయ దృక్పథం ఆయనను జాతీయ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిగా నిలిపాయి.
విభిన్న విధానపరమైన నిర్ణయాలు
రైతుల కోసం ₹21,000 కోట్ల రుణ మాఫీ, ధాన్యానికి క్వింటాల్కు ₹500 బోనస్, మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్లు, ప్రీమియం స్టోర్లు కల్పించడం వంటి సంక్షేమ చర్యలు రేవంత్ రెడ్డి ప్రజాదరణ పెరిగేలా చేశాయి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్జెండర్ల నియామకం వంటి వినూత్న నిర్ణయాలు ఆయన పాలనను మరింత ప్రత్యేకంగా నిలిపాయి.
శక్తిమంతుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి
ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు ముందువరుసలో ఉన్నారు. రేవంత్ రెడ్డి స్థానాన్ని మెరుగుపర్చుకోవడం తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా, దేశ రాజకీయాల్లోనూ కీలక మార్పులకు నాంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Revanth Reddy is 28th Most Powerful Indian 🔥@IndianExpress Indian Express Power List 2025https://t.co/gQSfFNpkzJ#RevanthReddy pic.twitter.com/iwp3FJwERX
— Anvesh Reddy (@AnveshReddy_RR) March 28, 2025