మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష.. బంగ్లాదేశ్‌లో హై అలర్ట్

Bangladesh on High Alert After Sensational Verdict Against Ex-PM Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనాకు మరణ శిక్ష విధిస్తూ ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు పెరిగి, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేసి, ఏవైనా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు పహారా ముమ్మరం చేశారు.

తీర్పులోని ముఖ్యాంశాలు
  • నేరం: మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.

  • కారణాలు: గత ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో సుమారు 1400 మంది మృతి చెందారని, తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని ICT న్యాయమూర్తి వెల్లడించారు.

  • బలప్రయోగం: ఆగస్టు 5న నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరపాలని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని హసీనా ఆదేశాలు ఇచ్చారని మరొక న్యాయమూర్తి పేర్కొన్నారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు కూడా నిరాకరించారని, అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని తెలిపారు.

  • శిక్ష: హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది.

  • దేశంలో హై అలర్ట్: ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌, ముఖ్యంగా రాజధాని ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. వాహనాలు తగలబెట్టేందుకు ప్రయత్నించే వారిని ‘కాల్చివేసేందుకు’ (షూట్ ఎట్ సైట్) ఆదేశాలు జారీ చేశారు.

షేక్ హసీనా స్పందన

గత ఏడాది విద్యార్థుల ఆందోళనల కారణంగా ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా, ఆగస్టు 5 నుంచి ఢిల్లీలోని ఒక రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. తీర్పు వెలువడడానికి ముందు ఆమె స్పందిస్తూ.. “నేను బతికే ఉన్నాను, ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి, నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు” అని అవామీ లీగ్ కార్యకర్తలకు సందేశం విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here