ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భూకబ్జాలకు పాల్పడే వారికి 14 ఏళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకుని రానున్నారు. ఏపీలో ఇష్టానుసారం, ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడినవారికి తగిన గుణపాఠం చెప్పేలా అలాంటి కఠిన శిక్షలు విధించి, భారీ జరిమానాలతో చెక్ పెట్టేలా ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
దీనికోసం ప్రస్తుతం ఉన్న భూఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు ప్రకారం ఇకపై భూఆక్రమణలకు పాల్పడేవారికి గరిష్టంగా 14 ఏళ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. అలాగే, ఏపీ డ్రోన్ పాలసీ , డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు కూడా ఏపీ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ – సీఆర్డీఏ పరిధి పెంపునకు ఆమోదం ఏపీ మంత్రి వర్గం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడంతో పాటు.. ఎక్కడో దూరంగా ఉంటున్నవారి భూములు కబ్జా చేయడం, పేదల భూములను లాక్కోవడం..అలాగే నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి నియంత్రించడం కోసం ఏపీ మంత్రి వర్గం ఈ కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 1982ను రద్దు చేసి.. దాని స్థానంలో ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం 2024 అమలుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు మంత్రివర్గం తాజాగా ఆమోదాన్ని తెలిపింది. అయితే పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితమవగా..కొత్త చట్టం ఏపీలోని అన్ని ప్రాంతాల్లో భూముల రక్షణ కోసం వీలు కల్పించబోతోంది. అలాగే, ఆక్రమణదారులకు 10- 14 ఏళ్ల జైలుశిక్ష, భూమి విలువతో పాటు నష్టపరిహారం కలిపి జరిమానా విధిస్తారు. దీనికోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో కేసుల పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.