ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా యూనిఫామ్ ఉద్యోగాలకు రెండు సంవత్సరాలు, నాన్-యూనిఫామ్ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 30వ తేదీలోపు జరిగే నియామకాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది. ఈ నిబంధనలు ఏపీపీఎస్సీతో పాటు పలు రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు కూడా వర్తిస్తాయి.
యూనిఫామ్ సర్వీసెస్ నియామకాలకు సంబంధించి, ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996 రూల్ 12 ప్రకారం గరిష్ట వయోపరిమితిని పెంచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. అయితే, పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖ, రవాణా శాఖ వంటి యూనిఫామ్ సర్వీసుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు మాత్రం ఈ సడలింపు వర్తించదని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఇక, రాష్ట్రంలో గతేడాది జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెలలో మెగా డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.