ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై పునర్విచారించాలని ఆదేశించింది. ఐదు రోజుల్లోనే ఈ సర్వే చేసి.. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంత సడన్ గా ఆర్డర్స్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది.
వైసీపీ ప్రభుత్వంలో పేదల పేరుతో ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై చంద్రబాబు ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాల్లో అనర్హుల సంఖ్య ఎక్కువ ఉందన్న సమాచారంతో వారిని గుర్తించే పనిలో పడింది. దానిలో భాగంగా సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ..వైసీపీ ప్రభుత్వ హయాంలో అందరికీ ఇళ్లపై పునర్విచారణకు ఆదేశాలను జారీ చేసింది.
ఐదు రోజుల పాటు రెవెన్యూ శాఖతో సర్వే చేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. ఈ నెల 15లోగా నివేదిక ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది. దీంతో అందరికీ ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో.. ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు.. ఎంతమంది అనర్హులకు కూడా ఇల్లు కేటాయించారు..తదతర విషయాలపై సర్వే చేయనున్నారు. ఇచ్చిన స్థలాల్లో ఎంతమందికి పట్టాలున్నాయనేది తేల్చి.. ప్రధానంగా అనర్హులను గుర్తించే పనిలో పడ్డారు.
సర్వేకు సంబంధించిన ఓ చెక్ లిస్ట్ ఫార్మాట్ను కూడా జిల్లాల కలెక్టర్లకు పంపడంతో.. ఆయా అంశాల వారీగా రెవిన్యూ శాఖ అధికారులు సర్వే చేయనున్నారు. గత ప్రభుత్వంలో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారని, కొంతమందికి ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి కూడా ఇళ్ల పట్టాలున్నాయని పెద్దయెత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పట్టాలు పొంది ఆ స్థలాల్ని ఇతరులకు అమ్మేశారనే విమర్శలు కూడా ఉన్నాయి.
దాంతో.. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకునే దిశగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఇళ్ల పట్టాలు పొందడానకి తమకు అన్ని అర్హతలూ ఉన్నాయని లబ్ధిదారులు మరోసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లబ్ధిదారులు సరైన ఆధారాలు చూపించకపోతే పట్టాలు రద్దయ్యే అవకాశాలు ఉండటంతో కొందరిలో ఆందోళన వ్యక్తం అయింది.