ఏపీలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి.. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్మెంట్పై గురువారం రోజు అధికారులతో కలిసి అమరావతిలో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి తీసుకొంటున్న చర్యలతోపాటు పలు అంశాలపైన కూడా చర్చించారు. అయితే ఈ సమావేశంలోనే.. ఇకపై ప్రతీ సోమవారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని డిప్యూటీ సీఎం డిసైడ్ అయ్యారు.
అంతేకాకుండా సొంత ఇలాకాలోని శాంతిభద్రతల అంశంపైన కూడా వపన్ ప్రత్యేకంగా ఆరా తీశారు. పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై ఇటీవల వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను అక్కడ పవన్ ప్రస్తావించారు. పిఠాపురం గురించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ దానిని పేషీ అధికారులకు వివరించారు. ఆ అంశాలను వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియచేయాలని పవన్ సూచించారు. దాంతోపాటు.. పిఠాపురం సెగ్మెంట్లోని నాలుగు పోలీస్ స్టేషన్లలోని పరిస్థితులపైన కూడా ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు
ఈ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గ పోలీసుల తీరుపైన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల వల్ల.. మొత్తం హోంశాఖ చులకన అవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. అందుకే.. ప్రజలను ఇబ్బందిపెడుతున్న నేరస్తులనే కాదు.. ఆ నేరస్తులకు అండగా నిలబడుతున్న నాయకులు, పోలీసులను కూడా ఉపేక్షించేదిలేదని పవన్కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాకుండా పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి.. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పిఠాపురం పరిధిలో ఉన్న ప్రస్తుత శాంతిభద్రతల అంశాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని పిఠాపురం అర్బన్ డెవలెప్మెంట్ అధికారులు తాజాగా ప్రకటించారు.
అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..పిఠాపురంలోని పోలీసు వ్యవస్థపై సడన్గా ఎందుకు ఫోకస్ పెట్టారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పిఠాపురం పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ల వ్యవహారాలపై పవన్ ఏకంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎందుకు అడగారన్న ఆసక్తి నెలకొంది. పిఠాపురం పోలీసులకు సంబంధించి రిపోర్ట్ కోరడం వెనుక పెద్ద కారణమే ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.