ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పుడు మరో స్ధానంలో జరగాల్సిన ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెలలో ఈ ఉపఎన్నికల జరగబోతోంది.
తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక కోసం ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 18వరకు నామినేషన్లు స్వీకరించి.. 19న నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 21గా పేర్కొన్నారు. డిసెంబర్ 5 న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. డిసెంబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి రిజల్ట్స్ ప్రకటించనున్నరు.
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ టీచర్ల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై వారు ఇందులో తీర్పు ఇవ్వబోతున్నారు. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసన సభ స్థానాలకు ఉప ఎన్నికపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో 14 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న ఎన్నికల పోలీంగ్ జరగాల్సి ఉండగా నవంబర్ 20కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.