ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న గుండెపోటుతో హైదరాబాద్ లో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మేకపాటి భౌతికకాయాన్ని సొంత జిల్లా నెల్లూరుకు తరలించారు. జిల్లాలోని ప్రజల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన ఇంటి వద్ద ఉంచనున్నారు. ఈరోజు రాత్రికి అమెరికా నుంచి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి రానున్నారు. రేపు (బుధవారం) ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కాగా, నెల్లూరు లోని మేకపాటి నివాసానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
రేపు ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి వివాదరహితుడు కావడంతో అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనికితోడు జిల్లాలో మేకపాటి కుటుంబం పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో వారికి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో వారందరూ తల్లడిల్లుతున్నారు. కాగా, మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ