ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం రూ. 3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్ను ప్రకటించింది. నిర్ణయించిన ముహుర్తం ప్రకారం ఉదయం 10.08 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 48,000 కోట్లు కేటాయించగా, పాఠశాల విద్యాశాఖకు రూ. 31,806 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 23,260 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 18,848 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 18,020 కోట్లు, పురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు, ఇందన శాఖకు రూ. 13,600 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ శాఖకు రూ. 11,636 కోట్లు, సాంఘిక సంక్షేమానికి రూ. 10,909 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రూ. 10,619 కోట్లు, రవాణా శాఖకు రూ. 8,785 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు, మూలధన వ్యయం రూ. 40,635 కోట్లుగా నిర్ణయించారు.
అభివృద్ధి పనులు, మేనిఫెస్టో హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉన్నందున, రాష్ట్ర బడ్జెట్ తొలిసారి రూ. 3 లక్షల కోట్లు దాటింది. పోలవరం ప్రాజెక్టుకు రూ. 6,705 కోట్లు, హంద్రీనీవా, ఉత్తరాంధ్ర స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు, జల్ జీవన్ మిషన్కు రూ. 2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ. 500 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ. 6,300 కోట్లు, ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ. 62 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ. 300 కోట్లు కేటాయించారు.