రాష్ట్రంలోని పట్టణాలను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని తెలిపారు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ. సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయకుండా నిషేధాన్ని విధిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే చట్టాన్ని చేశాయని.. మన రాష్ట్రంలో కూడా త్వరలోనే చట్టాన్ని తీసుకువస్తామన్నారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.
పట్టణ ప్రధాన రహదారి సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్ లు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే పట్టణాల్లోని గోడలకు పోస్టర్లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామని చెప్పారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.