ఏపీలో మొదటి లులూ మాల్ ఏర్పాటు కోసం..ప్రభుత్వం స్థలం కేటాయించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్నకు భూకేటాయింపులు చేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నంలో లులూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విశాఖలో అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణానికి పెట్టుబడులు పెట్టడానికి ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ వెల్లడించింది.
లులూ గ్రూప్ నుంచి ప్రతిపాదనలను పరిశీలించాక.. నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీఐఐసీకి ప్రభుత్వం అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు లులూ మాల్ కోసం 13.43 ఎకరాల హార్బర్ పార్కు భూములు ఏపీఐఐసీకి తిరిగి బదిలీ చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. లులూ మాల్ కోసం ఇవ్వాలనుకున్న భూమి వీఎంఆర్డీఏ అంటే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది.
విశాఖలో ఏర్పాటు కాబోయే లులూ మాల్లో ..చిల్డ్రన్స్ ఎమ్యూజ్మెంట్ పార్కుతో పాటు.. ఫుడ్కోర్టు, 8 స్క్రీన్లతో ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్లను నిర్మించడానికి ప్రతిపాదించింది. లులూ గ్రూప్ ఏపీ ప్రభుత్వాన్ని కొన్ని మినహాయిపులను కోరింది. మాల్ ఏర్పాటు కోసం కేటాయించే భూముల్ని 99 సంవత్సరాలకు లీజు ప్రాతిపదికన తమకు కేటాయించాలని కోరింది. అలాగే మూడేళ్లు కానీ షాపింగ్ మాల్ను ప్రారంభించే తేదీ వరకు కానీ అద్దె మినహాయింపును కూడా అడిగింది.
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 10 శాతం చొప్పున అద్దె పెంపును కూడా లులూ గ్రూప్ ప్రతిపాదించింది. నిజానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లులూ మాల్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నం బీచ్రోడ్డులోని హార్బర్ పార్కు భూములను కూడా కేటాయించింది.కానీ తర్వాత లులూ సంస్థకు భూముల్ని ప్రభుత్వం రద్దు చేయడంతో.. ఆ వెంటనే లులూ గ్రూప్ తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంది.
కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. లులూ గ్రూప్ను సంప్రదించగా.. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆ గ్రూప్ ఓకే చెప్పింది. అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో లులూ గ్రూప్ సంస్థల అధినేత జనవరిలో సమావేశమయ్యారు. వారి కోరికతో విశాఖపట్నంలో లులూ మాల్ కోసం స్థలాన్ని కేటాయించారు. విశాఖపట్నంలో మాత్రమే కాదు.. మరో రెండు చోట్ల కూడా మాల్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో లులూ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంతో పాటు అమరావతి, తిరుపతిలో కూడా లులూ మాల్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.