తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు.చుట్టుపక్కల కానీ, దగ్గరలో కానీ ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకుంటారు. అందుకే తిరుపతి నుంచి కాణిపాకం, భైరవకొన వంటి సమీప పుణ్యక్షేత్రాలతో పాటు.. అరుణాచలం, కంచి, వేలూరు వంటి పుణ్యక్షేత్రాల కూడా బస్ సర్వీసులు అందుబాటులో ఉంచారు ఏపీ ఆర్టీసీ అధికారులు. అయితే పళని సుబ్రమణ్య స్వామిని దర్శిచుకోవాలనుకునే భక్తులు సొంత వాహనాలలోనో..ప్రైవేటు వాహనాలలోనో వెళ్లాల్సి వచ్చేది . దీంతో పళని వెళ్లాలనుకునేవారి కోసం ఏపీ సర్కార్ ప్రత్యేక బస్సు సర్వీసుని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఏపీ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాక.. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను కూడా పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ..ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో ఉన్న షష్ట షణ్ముఖ యాత్ర చేపట్టానని.. ఆ యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడటం తాను చూశానని..వారు రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తుందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు అయిన బాలాజీ, సుబ్రహ్మణ్యం తనకు ఈ విషయంపై వినతి పత్రం అందించారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని… ఆ మురగన్ ఆశీస్సులతో అరగంటలోనే అనుమతి లభించిందని చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ఇప్పుడు తిరుపతి-పళని మధ్య రెండు లగ్జరీ బస్సులతో సర్వీసులను ప్రారంభించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తిరుపతి నుంచి పళనికి అలాగే.. పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో అక్కడ, ఇక్కడా రెండు బస్సులు స్టార్ట్ అవుతాయి. 505 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ ప్రయాణం 11 గంటల పాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటలకు మొదలైన బస్సు చిత్తూరు,ధర్మపురి మీదుగా ఉదయం 7 గంటలకు పళని చేరుకుంటుంది. అలాగే పళని నుంచి రాత్రి 8 గంటలకు మొదలైన బస్సు తిరుపతికి ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని ఈ సర్వీసులను ప్రారంభించారు. పెద్దలకు 680 రూపాయలు, చిన్నపిల్లలకు 380 రూపాయలుగా పళని టు తిరుపతి టికెట్ ధరలను నిర్ణయించారు.