ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీ తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ.. ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు వాడారంటూ పెద్దఎత్తున నిరసనలు మిన్నంటాయి.
ఈ లడ్డూ వివాదం తాజాగా సుప్రీంకోర్టును కూడా తాకింది. గత పాలకుల వైఫల్యమేనంటూ ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. పామాయిల్ కూడా రాని రేటుకు నెయ్యి ఎలా వచ్చిందంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
లడ్డూ తయారీపై ఏపీ ప్రభుత్వ విమర్శలు, దేశవ్యాప్త ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలపై సీరియస్ అయ్యింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన FSSAI.. తిరుమల వెంకన్నకు నెయ్యి పంపే నాలుగు కంపెనీల శాంపిల్స్ పరీక్షించింది. అయితే 3 కంపెనీలు ఈ టెస్ట్ పాసవ్వగా..టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫెయిల్ అవడంతో..దానికి నోటీసులిచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది.
ఇటు ఏఆర్ డెయిరీ మాత్రం.. తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదని చెబుతూ వస్తుంవి. మంచి నెయ్యినే పంపించామని.. క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే కంపెనీ నుంచి నెయ్యి వెళ్లిందని అంటోంది. ఎలాంటి న్యాయ విచారణకైనా తాము సిద్ధమంటూ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఏఆర్ డెయిరీకి FSSAI నోటీసులివ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నెయ్యి కల్తీపై ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.