దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వంటగ్యాస్ (LPG) సరఫరాపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏమీ లేదని, ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. యుద్ధ మేఘాల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు పెరుగుతాయనే ఆందోళనలో ఉన్న సామాన్యులకు ఇది పెద్ద ఊరట.
నిల్వల వివరాలు ఇవే: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్ష అనంతరం అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం..
-
మొత్తం నిల్వలు: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం మరో 15 రోజులకు అవసరమైన 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతోంది.
-
ఏజెన్సీల నెట్వర్క్: రాష్ట్రంలోని 1,154 గ్యాస్ ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
-
రవాణా: కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన ఎల్పీజీ కోటాను క్రమబద్ధీకరించేందుకు ఆయిల్ కంపెనీలతో అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు.
బ్లాక్ మార్కెట్పై నిఘా: స్టాక్ లేదని చెప్పి కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది.
-
నిరంతర సరఫరా: ఆస్పత్రులకు, హాస్టళ్లు, దేవాలయాలకు ఎలాంటి కొరతా లేకుండా చర్యలు తీసుకోవాలి. ఈకేవైసీ, ఓటీపీల ద్వారా గ్యాస్ సిలిండర్ల డైవర్షన్ లేకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
-
టెక్నాలజీ వాడకం: బుకింగ్ దగ్గర నుంచి డెలివరీ వరకు పారదర్శకత కోసం ఓటీపీ (OTP) విధానాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు.
-
ప్రజలకు విజ్ఞప్తి: అనవసరంగా భయాందోళన చెంది గ్యాస్ సిలిండర్లను హోర్డింగ్ (నిల్వ) చేయవద్దని సీఎం డీలర్లకు స్పష్టం చేశారు.
36 గంటల్లోనే: ప్రస్తుతం బుక్ చేసుకున్న 36 గంటల్లోనే సిలిండర్ వినియోగదారుడికి అందేలా యంత్రాంగం పనిచేస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తుగా నిల్వలను పెంచుకునేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు.






































