విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. “విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగువారి ఆత్మగౌరవానికి, ఆకాంక్షలకు ప్రతీక. ఇటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి పెట్టుబడుల ఉపసంహరణ బాధాకరమేనని జనసేన భావిస్తోంది. 22 వేల ఎకరాల్లో విస్తరించి 17 వేల మంది పర్మినెంట్, 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తున్న ఈ ప్లాంటు ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోకి వెళ్లిపోవడం అనేది జనసేన అభీష్టానికి వ్యతిరేకం. ఒకసారి ఈ కర్మాగారం చరిత్ర పుటలను తిరగేస్తే ఈ కర్మాగారం ఆవిర్భావం కోసం 32 మంది ప్రాణాలను వదిలారు. వందలాది మంది నిర్బందాలకు గురయ్యారు. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ఈ కర్మాగారం చేతులు మారుతుందంటే తెలుగువారందరికీ ఆమోదయోగ్యం కాని విషయమే” అని పేర్కొన్నారు
ప్రధాని మోదీకి విజ్ఞాపన తెలియజేయనున్న పవన్ కళ్యాణ్ :
“యు.పి.ఎ పక్షాన ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెస్ కు చెందిన మన్మోహన్ సింగ్ ముందుకు తీసుకెళ్లిన పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఆ పరిధిలోకి చేరిన ఉక్కు కర్మాగారాన్ని ఇప్పటి పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తుంది. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బి.జె.పి. జాతీయ అధ్యక్షులు నడ్డాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరనున్నారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రత్యక్షంగా ఈ విజ్ఞాపనను తెలుగువారి పక్షాన ఆయన తెలియచేస్తారు” అని ప్రకటనలో వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ