ఇంటర్ ఫలితాల్లో ఆ జిల్లా టాప్

ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 10.5 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన మంత్రి లోకేష్ .. ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాలు గత దశాబ్దంలో అత్యధిక పాస్ శాతంతో వెలువడడం తనకు గర్వంగా ఉందని అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులు 70శాతం మంది ఉత్తిర్ణత శాతం రాగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులలో 83 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో.. 93 శాతంతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా.. చివరి స్థానంలో అల్లూరి, అనకాపల్లి జిల్లాలు 73 శాతంతో నిలిచాయి.

అయితే ఇంటర్ ఫలితాల్లో ప్రయివేట్ కాలేజీల కంటే.. ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ సెకండిర్ పాస్ శాతం 69% కి చేరింది.. ఇది గత 10 ఏళ్లలో అత్యధికం అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాస్ శాతం 47%గా ఉండగా ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధిక శాతం అని అంటున్నారు.

స్టూడెంట్స్, జూనియర్ లెక్చరర్లు, ప్రతీ ఒక్కరి కృషికి ఈ విజయం ఉదాహరణ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈసారి విజయాన్ని సాధించలేకపోయిన విద్యార్థులెవరూ కూడా నిరాశ చెందొద్దని.. మరింత కృషి చేసి, మరింత బలంగా తిరిగివచ్చేలా ప్రయత్నించాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికి కూడా భవిష్యత్తులో మరిన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు. విద్యార్ధులు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, ఎన్నో విజయాలను సాధిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ వ్యాప్తంగా 26 జిల్లాల్లో మొత్తం 1535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి.మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు.. సుమారు 10లక్షల58వేల 892 మంది విద్యార్ధులు హాజరయ్యారు. అయితే పరీక్షలు పూర్తైన కేవలం 20 రోజుల్లోనే ఇంటర్ బోర్డు మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసింది. అలాగే గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సరిగ్గా ఏప్రిల్ 12వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది.