రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే మే 5వ తేదీ నుంచి యథావిథిగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పరీక్షల నిర్వహణ, సంబంధిత అంశాలపై గురువారం నాడు విజయవాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని, అన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహణ జరుగుతుందని అన్నారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు రోజు విడిచి రోజు పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 29, గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు:
ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే అదనంగా 41 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అత్యధికంగా తూర్పు గోదావరిలో 146 పరీక్షా కేంద్రాలు, అత్యల్పంగా గుంటూరులో 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రతి జిల్లాకు కోవిడ్ స్పెషల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేయడం, ప్రతి కేంద్రంలో థర్మల్ స్కానింగ్ ఏర్పాటు, భౌతికదూరం పాటించడం, మాస్కులు, శానిటైజేర్ ఇలా కరోనా నిబంధనలు అన్ని అమలయ్యేలా చూస్తామని అన్నారు. ప్రతి కేంద్రం లో ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేస్తాం. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థుల కోసం ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద ఉండే సిబ్బందికి పీపీఈ కిట్లు అందిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత ప్రభుత్వం బాధ్యతని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు గాని, తల్లిదండ్రులు గాని ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ