మహారాష్ట్రలో ఇటీవల కూలిపోయిన హెలికాప్టర్ ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెచ్చిందా? ముంబై నుంచి విజయవాడ తెస్తుండగా ప్రమాదం జరిగిందా అంటూ మూడు రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తుంది.చాలామంది దీనిని లైట్ తీసుకున్నారు.ఇటు ఏపీ ప్రభుత్వం కానీ..అటు ఏవియేషన్ అధికారులు కానీ దీనిపై ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే కొన్ని మీడియాలలో ప్రత్యేక కథనాలు వచ్చిన తర్వాత..అది చంద్రబాబు కోసం తెచ్చిన హెలికాప్టర్ అని తేలింది.అది సీఎం చంద్రబాబు కోసం తీసుకున్న ప్రైవేటు హెలికాప్టర్ అని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే ఏపీ గవర్నమెంట్ హెలిక్యాప్టర్ సర్వీసుకు ఇవ్వగా.. దాని స్థానంలో తెచ్చిన అద్దె హెలికాప్టర్ అని తెలియడంతో.. ఏవియేషన్ అధికారుల చుట్టూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం వినియోగించిన హెలిక్యాప్టర్నే..ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తున్నారు. జగన్ వాడిన హెలిక్యాప్టర్పైనే సీఎం చంద్రబాబు కూడా తిరుగుతున్నారు. అయితే ప్రతి 1000 గంటలు ప్రయాణం తర్వాత హెలిక్యాప్టర్ సర్వీసుకు ఇవ్వడం తప్పనిసరి. దీంతో చంద్రబాబు వినియోగిస్తున్న హెలిక్యాప్టర్ను కూడా.. సర్వీస్ కోసం జీఎంఆర్ సంస్థ ముంబైకి పంపించింది. అయితే ఈ హెలికాప్టర్ సర్వీసు పూర్తయినంతవరకు.. ఆ హెలిక్యాప్టర్ స్థానంలో స్టాండ్ బైగా ముంబై నుంచి మరో హెలికాప్టర్ను పంపించారు. ఆగస్ట్ 24న ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి.. అక్కడ నుంచి విజయవాడ తేవాలనేది ఏవియేషన్ అధికారుల నిర్ణయం. అయితే ముంబైలో బయలుదేరిన ఆ హెలిక్యాప్టరే ఆరోజు పూనే జిల్లా పాడ్ గ్రామం వద్ద అతి తక్కువ ఎత్తులో ఉండగా కూలిపోయింది. ఈ ఘటనలో హెలిక్యాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసం అయినా.. ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కానీ ఈ హెలికాప్టర్ ఘటనతో ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ ఉన్న ఒక సీఎం భద్రత విషయంలో వారు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. హెలికాప్టర్ను పంపేముందు సామర్థ్యం పరిశీలించకుండా, నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలిక్యాప్టర్ను పంపించడం మొదటి తప్పు. సాధారణంగా సీఎం స్థాయిలో ఉన్న నేతలు ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి. సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని వినియోగించాలి. కానీ సీఎం చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
నిజానికి 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న హెలిక్యాప్టర్ను అద్దెకు తీసుకోకూడదన్న కండిషన్ ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా వాతావరణం సరిగా ఉందా? లేదా? అనే విషయంలోనూ అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. అయితే ఏవియేషన్ అధికారులు వీటన్నిటినీ తుంగలో తొక్కేసి.. గ్లోబల్ వెకాట్ర అనే సంస్థ నుంచి 2008 మోడల్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నారు. అయితే ముందుగా 16 సంవత్సరాల నాటి హెలిక్యాప్టర్ను ఎంపిక చేసుకోవడమే మొదటి తప్పుగా చెబుతున్నారు. అందుకే అది తక్కువ ఎత్తులో నుంచి కిందకు పడినప్పటికీ పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ ప్రమాదం కేవలం ఏవియేషన్ అధికారుల అవగాహనా లోపంవల్లే జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రోటోకాల్తో పాటు ఏవియేషన్ ఎండీగా ఒకే అధికారి వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్సులో పని చేసే కల్నల్ ఇలాంటి బాధ్యతలను చూసుకునేవారు. అప్పట్లో వాతావరణంలో ఏ మాత్రం తేడా ఉన్నా సరే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతించేవారు కాదు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణం తర్వాత అధికారులు ఇంకాస్త శ్రద్ధ ఎక్కువ శ్రద్ధే తీసుకునేవారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత నియమించిన అధికారులంతా కూడా..ఇలాంటి విషయాలపై అవగాహన లేని వారే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ ఘటనతో ..జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న సీఎం చంద్రబాబు విషయంలోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని టీడీపీ నేతలు తప్పు పడుతున్నారు. ఏవియేషన్లో సీనియర్ అధికారులను నియమించాలని వారు కోరుతున్నారు.