గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్కు ఎదిగిపోయిన అతనికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో అతను చేసిన డ్యాన్సులు, ఫైట్స్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో అరుదైన ఘనత అందుకోనున్నాడు. లండన్ లని ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్లో మెగా పవర్ స్టార్ మైనపు విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు. చెర్రీతో పాటు అతని పెట్ డాగ్ రైమీ విగ్రహాన్ని కూడా ఈ మ్యూజియంలో ఏర్పాటుచేయనుండడం విశేషం.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయ్యిందని తాజాగా జరిగిన ఐఫా వేదక మీద మేడమ్ టుస్సాడ్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఇందులో టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రతినిధులు రామ్ చరణ్, రైమీల కొలతలు, ఫొటోలు తీసుకోవడం మనం చూడవచ్చు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ ఫ్యామిలీలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. టాలీవుడ్ నుంచి కూడా ప్రభాస్ (బ్యాంకాక్ మ్యూజియం), మహేశ్ బాబు (సింగపూర్), అల్లు అర్జున్ (దుబాయ్)లలో మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో కొలువు దీరాయి. అయితే రామ్ చరణ్ మైనపు విగ్రహం విషయంలో మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. మేడమ్ టుస్సాడ్స్ పుట్టినిల్లుగా లండన్ మ్యూజియానికి చరిత్ర ఉంది. ఇప్పుడు అక్కడ అడుగు పెడుతున్న మొదటి తెలుగు హీరోగా రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీని గురించి తెలుసుకున్న మెగాభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.