దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం పెరగడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మరో వైపు నీటి కాలుష్యంతో కూడా జనాలు సతమతమవుతున్నారు. యయునా నదిలో కాలుష్య స్థాయి విపరీతంగా ఉంది.
ఢిల్లీలో మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచి 400పైగానే నమోదైంది. ప్రస్తుతం డిల్లీలో సెకండ్ ఫేజ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చెబుతున్నదాని డేటా ప్రకారం.. ఉదయం 8 గంటలకు ఆనంద్ విహార్లో ఏక్యూఐ 457, అలీపూర్లో 389, వజీర్పూర్ 437, జహంగీర్పురి 440, రోహిణి 397, పంజాబీ భాగ్లో 403 ఏక్యూఐ రికార్డయ్యింది.
కాలుష్యం వల్ల విజిబులిటీ కూడా తగ్గింది. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ ఉదయం వివేక్ విహార్, ఆనంద్ విహార్, ఇండియా గేట్ తదితర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు దృశ్యమానత తగ్గింది. పెరుగుతున్న కాలుష్యంతో ప్రజల కళ్లల్లో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువ అయింది. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంట్లోనే ఉండి యోగా, ప్రాణాయామం చేయాలని సూచిస్తున్నారు. ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతోందని,కాలుష్యాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. కాలుష్య స్థాయిని తగ్గించడానికి సంబంధిత ఏజెన్సీలన్నీ చురుగ్గా పని చేస్తున్నాయని అన్నారు. కాలుష్యం పెరుగుతుండటంతో.. శీతాకాల కార్యాచరణ ప్రణాళిక కింద వివిధ శాఖలు, ఏజెన్సీలు చేస్తున్న పనులను సమీక్షించనున్నట్లు గోపాల్ రాయ్ పేర్కొన్నారు.