ఇకపై రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని నిర్ణయించింది. ఈ పనిని రైల్వే రక్షక దళానికి (ఆర్పీఎఫ్) అప్పగించింది. తోటి ప్రయాణికుల వలన ఎదురవుతున్న సమస్యలపై రైల్వే మంత్రిత్వ శాఖకు అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు రూపొందించారు. ఈక్రమంలో.. ఇక నుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలో పాటలు పెట్టి పెద్దపెద్ద శబ్దాలు చేయడాన్ని నిషేధించారు.
అలాగే, ఇకపై రైల్లో ప్రయాణించే సమయంలో పక్కనున్నవారికి ఇబ్బంది కలిగేలా ఫోన్లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ ప్రయాణికులతో పాటు గుంపులుగా ప్రయాణించే వారు సైతం రాత్రి పది గంటల తరువాత ఇతరులకు ఇబ్బంది కలిగించే రీతిలో బిగ్గరగా మాట్లాడకూడదు. రాత్రి 10 గంటల తర్వాత బోగీలో అన్ని లైట్లూ ఆర్పేయాలి. ఈ నిబంధనలను పాటించని ప్రయాణికులపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. తోటి ప్రయాణికుల వలన ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా 139 నంబరుకు ఫోన్ చేస్తే చాలు.. అలా ఇబ్బందికరంగా ప్రవర్తించే వారిపై ఆర్ఫీఎఫ్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకుంటారు.
కొత్త నిబంధనలను అనుసరించి ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినా.. లేదా మరేవిధమైన ఇబ్బంది కలిగించినా సందర్భాన్ని బట్టి కేసు నమోదు చేసి.. జైలుకు కూడా పంపించే అవకాశం కూడా ఉంది. దీనిపై బోగీల్లోని ఆర్ఫీఎఫ్ సిబ్బంది, టికెట్ చెకర్లు, కోచ్ అటెండెంట్లు, క్యాటరింగ్ సహా ఇతర రైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులు ఇతరుల పట్ల మంచి ప్రవర్తనతో ఉండేలా వీరు అప్రమత్తం చేస్తుంటారు. ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే ఆ రైలు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ