భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో జమిలీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే.. అభివృద్ధి పనులకు ఏమాత్రం ఆటంకం కలుగకుండా ఉంటుందని.. ఖర్చు కూడా ఆదా అవుతుందని గతంలోనే అభిప్రాయపడింది.
ఈ మధ్య కేంద్ర కేబినెట్ కూడా జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలపై కాస్త తర్జన భర్జన పడుతున్నాయి. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా జమిలీ ఎన్నికలవైపు మొగ్గు చూపారు. కాగా దేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో.. ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతోందని తెలుస్తోంది.
నిజానికి జమిలీ ఎన్నికలు జరగాలంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 85, 172, 174, 356 లు.. రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలి. అయితే ఈ బిల్లు యాక్సెప్ట్ అవ్వాలంటే.. లోక్ సభ, రాజ్యసభలోని 67 శాతం మంది ఈ బిల్లుకు సపోర్ట్ చేయాలి. అలాగే 14 రాష్ట్రాలు అసెంబ్లీలు సపోర్ట్ చేయాలి. అలా మద్దతునిస్తే.. బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది.
2024 శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు కనుక పార్లమెంట్ లో మద్దతు లభిస్తే.. 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజులకు మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలీ ఎన్నికలు జరుపబోతున్నట్టు తాజాగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.