ఢిల్లీ ఎన్నికలలో ప్రచారానికి రెడీ అయిన ప్రధాని మోదీ

PM Modi Ready To Campaign In Delhi Elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ అయిన ఆప్, కేంద్రంలో ఉన్న బీజేపీ, ప్రతి పక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంటోంది. ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పెద్దలు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు.దీనికోసం రిపబ్లిక్ డే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. అలాగే హోం శాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు కూడా తమతమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా వడివడిగా అడుగులు వేస్తూ..మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు వెళ్లింది. ఎన్నికల ప్రచారంలో పైచేయి చేసేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. రిపబ్లిక్ డే తర్వాత బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకోనుంది.

ప్రధాని మోదీ కనీసం మూడు ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 29, 31, ఫిబ్రవరి 2న ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏకంగా.. 15 ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారని తెలుస్తోంది. అటు జేపీ నడ్డా కూడా పలు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 5న ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా..ఫిబ్రవరి 8న ఓట్లు లెక్కిస్తారు. ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండటంతో.. మొత్తం 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అత్యధికంగా అర్వింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇటు నాలుగోసారి విజయం కోసం ఆప్‌ అధినేత , మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెక్‌ పెట్టి ఢిల్లీలో పాగా వేయడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా ఈసారి ఢిల్లీలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్‌ చూస్తోంది. కానీ ఇండి కూటమిలోని కీలక పార్టీలు కాంగ్రెస్‌ను కాదనుకుని.. ఆప్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారినట్లు తెలుస్తోంది.