కొద్దిరోజులుగా హిందీ, తమిళ భాషా వివాదం రేగుతున్న సమయంలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం స్టాలిన్ని టార్గెట్ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల నుంచి లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని గుర్తు చేశారు. ఒకవేళ వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలంటూ సెటైర్ వేశారు.
కొన్నిసార్లు తమిళనాడు నేతలు రాసే లేఖల్లో తమిళంలో సంతకం ఉండకపోవడాన్ని చూసి తానే ఆశ్చర్యపోతానని ప్రధాని చెప్పుకొచ్చారు. వారిలో ఎవరు కూడా తమిళంలో సంతకం చేయరన్న మోదీ.. తమిళం గురించి గర్వపడితే, ప్రతీ ఒక్కరూ కనీసం తమిళంలో సంతకం చేయాలని తాను అభ్యర్థిస్తున్నానని రామేశ్వరంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ అన్నారు.
జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రం కేంద్రం, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన సమయంలో.. ప్రధాని మోదీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం హాట్ టాపిక్ అయ్యాయి.
ఇటీవల అధికార డీఎంకే నేతలతో పాటు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. హిందీని తమిళనాడుపై రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్రం తమిళ భాష, సంస్కృతిని బెదిరిస్తోందంటూ చెప్పారు. కాగా ఇలాంటి సమయంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అలాగే పేద కుటుంబాల పిల్లలు కూడా డాక్టర్లు కావాలనే వారి కలను నెరవేర్చడానికి.. తమిళనాడు ప్రభుత్వాన్ని తమిళ భాషలో వైద్య కోర్సులు ప్రారంభించాలంటూ ప్రధాని మోదీ.. ఆ ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ యువతీ యువకులు.. వైద్యులు కావడానికి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడమే తమ ప్రయత్నమన్న మోదీ.. 10 ఏళ్లలో తమిళనాడుకు 11 కొత్త వైద్య కళాశాలలు వచ్చాయని గుర్తు చేశారు.
మరోవైపు తమిళనాడు కొత్త విద్యా విధానాన్ని అంగీకరించకపోవడంతో 2వేల కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయని అధికార డీఎంకే ప్రభుత్వం గతంలో ఆరోపించింది. కానీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అందించే నిధులు పెరిగాయని, తమిళనాడు అనేక కేంద్ర పథకాల నుంచి ప్రయోజనం పొందిందని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఈ పదేళ్లలో తమిళనాడు రాష్ట్ర రైల్వేకి బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని ప్రధాని చెప్పారు. 2014కి ముందు ప్రతీ ఏడాది తమిళనాడుకు 9వందల కోట్లు మాత్రమే కేటాయించారన్న మోదీ.. ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్కి 6వేల కోట్లు దాటిందని చెప్పారు.