అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ గౌతమ్ అదానీపై అగ్రరాజ్యం అమెరికాలో అభియోగాలు వినిపించడం..దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఒకవేళ ఈ నేరం రుజువైతే కనుక 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదానీ అమెరికన్ ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ, ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారంటూ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తాజాగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
భారతదేశ అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టులను పొందడానికి గాను..అదానీ భారతీయ అధికారులకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లుగా అదానీ గ్రూప్ ఛైర్మన్ అమెరికాలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. గౌతమ్ అదానీపై .. విదేశీ లంచం, సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్ కుట్ర, సంబంధిత అభియోగాలు వినిపిస్తున్నాయి. రెండు దశాబ్దాల్లో 2 బిలియన్ డాలర్ల విలువైన సోలార్ కాంట్రాక్టులను దక్కించుకోవడానికి..గౌతమ్ అదానీ 250 మిలియన్ డాలర్లకు పైగా లంచాన్ని ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
సంబంధిత కంపెనీలు అమెరికాలో పనిచేస్తున్నప్పుడు.. వారిపై కనుక లంచం ఆరోపణలు వస్తే, వాటిపై అభియోగాలు వేయడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తాయి. ఒకవేళ గౌతమ్ అదానీ భారత్లో ఉంటే.. ఆయన్ని అప్పగించాలని అమెరికా ప్రాసిక్యూటర్లు కోరాల్సి ఉంటుంది. భారత న్యాయస్థానాలు.. భారతదేశంలోని చట్టం ప్రకారం సంబంధిత అభియోగాలు నేరం మోపబడినవారికి వర్తిస్తాయో లేదో అంచనా వేస్తాయి. ఏదైనా రాజకీయ , మానవ హక్కుల ఆందోళనలను కూడా అంచనా వేస్తాయి.
అయితే తనపై వచ్చిన అభియోగాలను గౌతమ్ అదానీ సవాల్ చేసుకోవచ్చు.దీంతో అమెరికాకు అదానీ అప్పగింతపై విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది. అయితే గౌతమ్ అదానీ ఇంకా అమెరికా కోర్టు ఎదుట హాజరుకాలేదు కాబట్టి .. తన పిటిషన్ దాఖలు చేయలేదని వార్తా సంస్థ రాయిటర్స్ చెబుతోంది. అదానీని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసినా లేక ఆయనే లొంగిపోయినా.. ఆ తర్వాత అదానీ తరఫు న్యాయవాదులు అదానీపై అభియోగాలను సవాల్ చేయొచ్చు. ప్రాసిక్యూటర్లు అంగీకరించాల్సిన బాధ్యత లేకపోయినా కూడా రెండు పార్టీల మధ్య పిటిషన్ డీల్ గురించి చర్చలు జరగొవచ్చు.
అయితే ఈ పూర్తి వ్యవహారంపై అంత ఇమ్మీడియట్గా విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. సాక్ష్యాధారాల సవాళ్లతో పాటు..అదానీ సహ ప్రతివాదులకు ప్రత్యేక విచారణలతో సహా చట్టపరమైన చర్యలన్నీ ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ కనుక ఈ నేరం రుజువైతే లంచం ఇచ్చినందుకు అదానీకి ఐదేళ్లు జైలు శిక్ష.. అలాగే మోసం, కుట్ర అభియోగాల కింద మొత్తంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అదానీకి గణనీయమైన జరిమానాలు కూడా పడే అవకాశం ఉంది.అయితే కోర్టు ఏ శిక్ష విధించినా అదానీ లీగల్ టీమ్ మళ్లీ అపీల్ చేసుకోవచ్చు. దీంతో ఇది సుదీర్ఘ న్యాయ పోరాటంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.మరోవైపు లంచం ఇచ్చి పని చేయించుకున్నారని వస్తున్న ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండిస్తోంది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తాము అన్ని చట్టాలకు కట్టుబడే పని చేస్తున్నామని అదానీ గ్రూప్ తెలిపింది.