ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోందన్నది నిజం. అలాగే టెక్నాలజీ రంగంలో అమెరికా తరువాత చైనా రెండో స్థానంలో కొనసాగుతుందనేది అంతే నిజం. ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన చైనా.. తాజాగా మరో అరుదైన ప్రయోగం చేసి రికార్డ్ సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపును తనవైపు తిప్పుకుంది.
సాధారణంగా మనిషికి చావులేకుండా చేయడమనేది అసాధ్యం. ఎందుకంటే పుట్టిన ప్రతీ ప్రాణి కూడా ఏదొక రోజు చనిపోక తప్పదు కాబట్టి. అయితే ఇపుడు మనిషి చావుని జయించే దిశగా.. చైనా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.దీనిలో తొలి అడుగు వేసి విజయవంతం అయింది. చనిపోయిన మెదడును 50 నిమిషాల తర్వాత తిరిగి బ్రతికించిన అరుదైన ప్రయోగం చైనాలో జరిగింది.
చైనా పరిశోధకులు ఈ సరికొత్త ఘనతను సాధించి అసాధ్యం అనుకున్నదానికి సుసాధ్యం చేసి చూపించారు. గుండెపోటు తర్వాత పేషెంట్లకు పునరుజ్జీవనం అందించడంలో సహాయపడే ప్రయోగంలో ఓ అడుగు ముందుకు వేసినట్టు చైనా జనరల్స్ లో పబ్లిష్ అయింది. దీనిలో భాగంగా.. ఓ ప్రయోగంలో చనిపోయిన తర్వాత పంది మెదడును తొలగించి.. 50 నిమిషాల తర్వాత దానిని మరలా పునఃప్రారంభించినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు.
హార్ట్ అటాక్ వల్ల మెదడు దెబ్బతినడాన్ని సరిచేసే ప్రక్రియలో.. కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని తాజా పరిశోధన ద్వారా తెలిసిందని చైనా శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. గ్యాంగ్ జౌ లోని సన్ యాట్ సేన్ యూనివర్శిటీ కో హాస్పిటల్ లోని పరిశోధకులు..పంది మెదడులోని నాడీ కార్యకలాపాలను దాని బాడీ నుంచి తొలగించాక తిరిగి పునరుద్దరించడానికి లైఫ్ సపోర్ట్ సిస్టంను ఉపయోగించినట్లు చెప్పారు.
జర్మన్ ట్రాన్స్ ప్లాంటేషన్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ జోయెర్న్ నాషన్, క్లీవ్ ల్యాండ్ క్లీనిక్ లోని ఇమ్యుూనిటీ స్పెషలిస్ట్ ఆండియా వంటివారు ఈ ప్రయోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. లివర్ అసిస్టెడ్ బ్రెయిన్ నార్మోథర్మిక్ మెషిన్ పెర్ఫ్యూజన్ అని పిలిచే “ఎక్స్ వివో బ్రెయిన్ మెయింటినెన్స్” సాంకేతికతను ఈ టీమ్ డెవలప్ చేసింది. ఇలా ఈ పరిశోధకులు పందులకు మత్తుమందు ఇచ్చి పంది మెదడులను వేరు చేసే ఆపరేషన్ చేసారు. ఈ సమయంలో మెదడు మాత్రమే ఎన్ఎంపీ కి కనెక్ట్ చేయబడింది. అయితే ఈ సమయంలో మెదడు తరంగాలు పంది బాడీ నుంచి తొలగించబడిన 50 నిమిషాల తర్వాత.. ఆ తరంగాలు తిరిగి పంది మెదడుకు వచ్చినట్లు సైంటిస్టులు వెల్లడించారు.