120 అడుగుల గ్రహశకలం.. భూమికి దగ్గరగా వస్తున్నట్లు నాసా అధికారులు తాజాగా ధ్రువీకరించారు. అయితే, దీని వల్ల భూమికి, జీవజాలానికి కూడా ఎటువంటి ప్రమాదం లేదని చెప్పింది.
చిన్న పాటి విమానం పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం 2022 SW3 దాదాపుగా 1.6 మిలియన్ మైళ్ల కన్నా దగ్గరగా రాబోతుందని చెప్పింది. ఈ గ్రహశకలం వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాసా జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీ వెల్లడించింది. ఈ గ్రహశకలం భూమికి, చంద్రుడికి మూడు రెట్ల దూరం నుంచి వెళుతున్నట్లు చెప్పింది
శాస్త్రవేత్తలు 2022 SW3తో పాటు తెలిసిన గ్రహశకలాల కక్ష్యలను ట్రాక్ చేస్తారు. నిజానికి, గ్రహశకలాలు సౌర వ్యవస్థ తొలినాళ్లలోని వస్తువులుగా పరిగణిస్తారు. 4.6 బిలియన్ ఏళ్ల క్రితం సౌర కుటుంబ ఆవిర్భావ సమయంలో ఇవి మిగిలిపోయిన వాటిగా గుర్తిస్తారు. 66 మిలియన్ ఏళ్ల క్రితం డైనోసార్లు అంతానికి కారణమైన చిక్సులబ్తో సహా కొన్ని గ్రహశకలాలు భూమిపై ప్రభావాన్ని చూపించాయి.
ఇదిలా ఉంటే నాసాతో పాటు పదే దేశాలు ఈ గ్రహశకలాల పరిశోధనలపైన కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భూమిపై జీవానికి, నీటికి ఆధారం ఈ గ్రహశకలాల నుంచి లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రహశకలాలు ఇలా భూమికి సమీపంలోకి వచ్చిన సందర్భంలో.. శాస్త్రవేత్తలు వీటిపై అధ్యయనాలు చేస్తుంటారు.
భూమికి సమీపంలో ఉన్న ఇలాంటి గ్రహశకలాల భయాన్ని దూరం చేయడానికే అంతరిక్ష సంస్థ నాసా రక్షణ వ్యవస్థను రూపొందించింది. ప్రపంచంలోనే తొలిసారిగా నాసా డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ ని రూపొందించింది. దీనిలో అంతరిక్షంలోని గ్రహశకలాల గమనాన్ని మార్చేలా, అంతరిక్షంలోకి వెళ్లేలా ప్రయోగాన్ని చేసింది.