జాతీయ శాంపుల్ సర్వే సంస్థ (NSSO) నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. జాతీయ స్థాయిలో 8758 గ్రామాలు, 6540 పట్టణాల్లోని 3.02 లక్షల కుటుంబాలపై ఆరోగ్యం, అప్పులు, మొబైల్, ఇంటర్నెట్, విద్య తదితర అంశాలపై సర్వే నిర్వహించింది. తెలంగాణలో పరిస్థితులనూ విశ్లేషించింది. ఈ సర్వేలో రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 42.4 శాతం మందికి అప్పులు ఉన్నాయని వెల్లడైంది. మనదేశ జాతీయ సగటుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.
తెలంగాణ ప్రజల్లో ఎక్కువమంది ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పాటు అత్యవసరాలు వచ్చినప్పుడు అప్పులు చేస్తున్నారని సర్వే రిపోర్టులో వెల్లడయింది. ఇతరుల వద్ద డబ్బులను చేబదులు తీసుకుంటున్నారు. అయితే ఆ డబ్బును సకాలంలో తిరిగి ఇవ్వలేక సతమతం అవుతున్నారని పేర్కొంది. ఆదాయం తగిన విధంగా లేకపోవడం, అది క్రమంగా పెరగకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. తెలంగాణ లోని 18 ఏళ్లకు పైబడిన ప్రతి లక్ష మందికిగానూ 42,407 మంది ఇలాంటి పరిస్థితుల్లోనే జీవితం గడుపుతున్నారు.
•రాష్ట్రంలోని 18 ఏళ్లకు పైబడిన వారిలో 97.5 శాతం మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి.
•తెలంగాణలోని ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒక సభ్యుడు ఏటా ఒకసారి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్నారు.
•గ్రామాల్లోని కుటుంబాలు ప్రతి సంవత్సరం వైద్య ఖర్చులకు రూ.5,088, పట్టణాల్లోని కుటుంబాలు ఏటా వైద్యానికి రూ.5,648 ఖర్చు చేస్తున్నాయి.
•రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకే ఎక్కువ అప్పులు ఉన్నాయి. తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి లక్ష మందిలో సగటున 50,289 మంది, పట్టణాల్లో ప్రతి లక్ష మందిలో 31,309 మంది అప్పుల్లో ఉన్నారు.
•తెలంగాణలో 6-10 ఏళ్లలోపు చిన్నారుల్లో 94 % మంది చదువుకుంటున్నారు. బడికి వెళ్తున్న చిన్నారుల్లో బాలురు 94.1%, బాలికలు 94.5% ఉన్నారు.
•బాలురతో పోల్చితే బాలికల సంఖ్య ఎక్కువ. గ్రామాల్లో 94.9%, పట్టణాల్లో 93.4% మంది ప్రాథమిక విద్యలో నమోదై ఉన్నారు. వీరిలో పట్టణాలతో పోల్చితే గ్రామాల్లోనే ఎక్కువ
అందరికి స్మార్ట్ఫోన్లు
తెలంగాణలో 15 ఏళ్లు పైబడిన వారిలో 92.3 శాతం మందికి స్మార్ట్ఫోన్ వాడకంపై అవగాహన ఉంది. గ్రామాల్లో 90.7 శాతం, పట్టణాల్లో 94.5 శాతం మంది మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. వీరిలో పురుషులు 96.4%, మహిళలు 88.2% ఉన్నారు. వీరందరి సిమ్కార్డులు యాక్టివ్గా ఉన్నాయి.