చాలామంది మిగిలిన సమయాలలో వాటర్ పెద్దగా తీసుకోకపోయినా.. ఆహారం తిన్న వెంటనే మాత్రం నీళ్లు కచ్చితంగా తాగుతారు. కానీ ఇది మంచి అలవాటు కాదని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నాక అస్సలు నీటి జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. నిజానికి భోజనానికి ముందు, తినేటప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉండటమే దీనికి కారణం. వాటర్ తాగడం వల్ల ఆహారం వేగంగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
వేరు శనగలు తిన్నాక మంచినీళ్లు తాగక పోవడమే మంచిది. వేరు శనగల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వులు పేరుకుపోతాయి. దగ్గు, గొంతు మంటకు ఇది దారి తీస్తుంది. అలాగే భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆహారం జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పైగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది.
గోరు వెచ్చని పాలు తాగాక మంచినీరు తాగితే కడుపు నొప్పి లేదా పొట్టలో ఇబ్బందులు తలెత్తుతాయి. పాలు తాగాక నీరు తాగడం వల్ల జీవక్రియలు మందగిస్తాయి. పాలు తాగిన తర్వాత పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. కానీ నీటిని తాగడం వల్ల ఇవి పలుచన అవుతాయి. దీంతో శరీరం మరింతగా ఆమ్లాలు ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇది అసమతుల్యతకు దారి తీస్తుంది.
నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని తిన్నాక.. నీటిని తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి. సో ఇకనుంచి పైన చెప్పిన ఆహారపదార్థాలు తిన్నతర్వాత ఎంత దాహం వేసినా.. నీళ్లు తాగే పద్ధతికి బై చెప్పేయండి.
పుచ్చకాయ తిన్న తర్వాత మంచినీళ్లు తాగితే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఆహారాన్ని శోషించుకోవడాన్ని, జీర్ణం కావడాన్ని నీరు నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల కడుపులో ఆమ్లస్థాయిలు పెరిగిపోతాయి. అలాగే అరటి పండు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి నీరు అస్సలే తాగొద్దట. ఇలా చేస్తే తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుందని హెచ్చరిస్తున్నారు. అరటి పండు తిన్నాక పావు గంట అయిన తర్వాత.. నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు.