పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే చాలామంది ఎన్నికూరలు , పచ్చళ్లు ఉన్నా చివరలో పెరుగన్నం తిననిదే భోజనం చేసినట్లు ఉండదని ఫీలవుతారు. అలాగే మరికొందరు మాత్రం అమ్మో పెరుగా అన్నట్లు ఫేస్ పెడతారు. కానీ డాక్టర్లు మాత్రం కొంతమంది పెరుగు తినడం అస్సలు మంచిది కాదంటున్నారు. కొన్ని వ్యాధులు ఉన్నవారు పెరుగు తీసుకోవడం మానేయాలని.. పెరుగును ప్రతిరోజూ అవసరానికి మించి తీసుకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
లాక్టోస్ ఇరిటేషన్ ఎక్కువగా ఉన్నవారు.. పెరుగు తీసుకోవద్దు. అలాంటి వారికి పెరుగు తినడం వలన డయేరియా మరియు కడపులో నొప్పి సమస్యతో బాధపడవలసి వస్తుంది. అసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నవారు కూడా పెరుగును అస్సలు తినకూడదు. పెరుగు లేకపోతే తినినట్టు ఉండదనుకునేవాళ్లు మాత్రం పెరుగుకు బదులు.. మజ్జిగ తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీరు రాత్రి పూట పెరుగు అస్సలు తినవద్దని చెబుతున్నారు.
పెరుగు తినడం కీళ్లనొప్పులు ఉన్న రోగులకు హానికరం. అర్థరైటిస్ రోగులు పెరుగును అప్పుడప్పుడు మాత్రమే తినాలి రోజూ తింటే.. ఇది నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడేవారు పెరుగు తీసుకోవద్దు. అలాగే ఆస్తమా రోగులు కూడా పెరుగు తీసుకోవడం మానుకోవాలి. పెరుగు తినాల్సి వస్తే కేవలం పగటి పూట మాత్రమే పెరుగు తీసుకోవాలి. రాత్రిపూట అస్సలు తీసుకోవద్దు.
పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎముకలకు మేలు చేస్తుంది. పెరుగును రోజూ తీసుకుంటే అది కొలెస్ట్రాల్ , హై బీపీ సమస్యను తగ్గిస్తుంది. పెరుగుతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా, చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. పెరుగు తీసుకోవడం వలన ఎముకలు, దంతాలకు మంచిది. కాబట్టి పై వ్యాధులున్న వారు తప్ప మిగిలిన వారంతా పెరుగును ఎంచక్కా తినొచ్చు.