కొంతమంది చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏడుస్తూ ఉంటారు. దీంతో ఏంటీ చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని అంటుంటారు. కానీ అలా ఏడవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా ఏర్పడే భావోద్వేగాలను అణచివేయడం అసలు ఏ మాత్రం మంచిది కాదట. ఏడుపు వస్తే..ఏడ్వడం ద్వారా కావాల్సిన మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు.
నిజానికి ఏడుపు ఒక గొప్ప ఒత్తిడి నివారిణిగా నిపుణులు చెబుతున్నారు. అంతెందుకు శారీరకంగా నొప్పిని అనుభవిస్తున్నప్పుడు కూడా ఏడిస్తే కాస్త రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. మానసికంగా ఇబ్బంది పడినట్లు అన్పిస్తే ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏడుపు గొప్ప ఔషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏడ్వకుండా ఆ బాధను లోపల ఉంచుకోవడం వల్ల మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి ఏడ్వాలని అన్పిస్తే నిస్సంకోచంగా ఏడ్చేయండి అంటున్నారు.
మనసు భావోద్వేగానికి లోనయినప్పుడు ఏడిస్తే..ఆ ఏడుపు మనిషికి ప్రశాంతతను ఇచ్చి..మనస్సు తేలిగ్గా ఉంచుతుంది. బాధను అదుపులో పెట్టుకోకుండా ఏడ్చేస్తే.. మనసు రిలాక్స్గా ఉంటుంది. ఇలా ఏడవడం వల్ల మనసు తేలికైన అనుభూతి కలగడం చాలామంది ఫేస్ చేసే ఉంటారు. అంతేకాదు ఏడిస్తే వారిలో ఉన్న ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. దీనివల్ల మైండ్ కూడా రిలాక్స్ అవడంతో పాటు ఏడుపు వల్ల మనసు భారం కూడా తగ్గుతుంది. చివరకు చిన్నపిల్లలు ఏడ్చినా కూడా వారికి మంచిదేనని..వాళ్ల ఏడుపు వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయని అంటున్నారు.