రాగిపిండి, అరటిపండుతో స్మూతీలా చేసుకుని ప్రతీ రోజూ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంగా దీనిని తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. దీనికోసం రాగి పిండి 3 స్పూన్లు లేదా 45 గ్రాములు, అరటి పండు ఒకటి, బెల్లం లేదా తాటి బెల్లం 15 గ్రాములు, పాలు , కొబ్బరి పాలు లేదా మజ్జిగ 200 మిల్లీ లీటర్లు, ఓ గ్లాసు వాటర్ తీసుకోవాలి.
ముందుగా రాగి పిండిని 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత అరటి పండు, బెల్లం, రాగి పిండిని మిక్సీలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత పాలు లేదా కొబ్బరిపాలను ఇందులో పోసి బాగా మృదువుగా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి, బనానా స్మూతీ తయారవుతుంది.
బనానా, రాగి పిండితో చేసిన దీనితో ఆరోగ్యకరమైన అల్పాహారంగా చెబుతారు. బెల్లంలో ఐరన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉండే కారకాల్లో రాగి పిండి ముందు వరుసలో ఉంటుంది. కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది ఓ వరంగా చెప్పొచ్చు. ఎక్కువ పోషకాలు ఉండటం వలన పిల్లలకు పాలిచ్చే తల్లికి ఆహారంగా దీన్ని సిఫార్సు చేస్తారు.
ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఆందోళన, రక్తపోటు, నిరాశ, మైగ్రేన్ లాంటి రోగాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది. అయితే డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారు బెల్లం లేకుండా ఈ స్మూతీని తీసుకుంటే మంచిదని అంటున్నారు.