43 ఏళ్ల వయసులోనూ ధోనీ మెరుపు స్టంపింగ్‌..

ఐపీఎల్ 2025లో మహేంద్ర సింగ్ ధోనీ తన మునుపటి దృష్టిని, చురుకుదనాన్ని మరోసారి ప్రదర్శించాడు. 43 ఏళ్ల వయస్సులోనూ యువకుడిలా వికెట్ల వెనుక మెరుపు వేగంతో కీపింగ్ చేస్తూ అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో, తన శీఘ్ర స్పందనతో ఫ్లాష్ స్టంపింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

సీఎస్కే-ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో, టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ బెంగళూరును ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఓపెనింగ్ కోసం క్రీజులోకి వచ్చారు. ఫిల్ సాల్ట్ తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడి చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచగా, విరాట్ కోహ్లి స్వల్పంగా సాగాడు.

మ్యాచ్ ఐదో ఓవర్‌లో నూర్ అహ్మద్ బౌలింగ్‌కు వచ్చాడు. అతని స్పిన్ ఆర్సీబీ ఓపెనర్లకు ఇబ్బంది కలిగించింది. ఓవర్ చివరి బంతికి ఫిల్ సాల్ట్ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్రీజు వదిలాడు. అదే క్షణంలో వికెట్ల వెనుక ఉన్న ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. ఫిల్ సాల్ట్ క్రీజులో ఉన్నట్లు అందరికీ అనిపించినప్పటికీ, రీప్లేలో అతని కాలు గాల్లో ఉండగా వికెట్లు విరగొట్టినట్లు స్పష్టమైంది. 16 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్ పెవిలియన్‌కు చేరాడు.

ఈ సీజన్‌లో ఇదే తరహాలో ధోనీ మరో కీలక స్టంపింగ్ చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే నూర్ అహ్మద్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్‌ను వేగంగా స్టంప్ చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ధోనీ తన మునుపటి ఫామ్‌ను కొనసాగిస్తూ చురుకుదనంతో బ్యాటర్లను పెవిలియన్ పంపి తన అద్భుత కీపింగ్ స్కిల్స్‌ను మరోసారి రుజువు చేసుకున్నాడు. గ్రౌండ్‌లో ధోనీ అద్భుత ప్రదర్శన చూసిన అభిమానులు “తలా! తలా!” అంటూ హర్షధ్వానాలు చేశారు.